నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 09:18

భారత డైనమిక్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా పీవీ రాజారామ్‌

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ బీడీఎల్‌ డైరెక్టర్‌ ప్రొడక్షన్‌ గా పీవీ రాజారామ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆయన.. పృథ్వీ, ఆకాష్‌ తదితర క్షిపణుల తయారీలో ప్రధాన పాత్ర పోషించారు.

ఈ రంగంలో రాజారామ్‌కు 34 ఏండ్ల అనుభవం ఉన్నది. గతంలో బీడీఎల్‌ హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ యూనిట్‌కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, యూనిట్‌ హెడ్‌గా కూడా విధులు నిర్వహించారు...

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 09:17

శ్రావణ శుక్రవారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

శ్రావణ శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బీభత్సంగా పెరిగింది. నేడు శుక్రవారం అన్ని కంపార్ట్‌మెంట్లూ భక్తులతో నిండిపోయి క్యూలైన్ వెలుపలికి వచ్చేశారు.

నేడు టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

నిన్న గురువారం తిరుమల శ్రీవారిని 59,808 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.6 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 25,618 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 09:16

తెలంగాణలో మరోసారి అమిత్ షా" పర్యటన

మరోసారి తెలంగాణ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు.. ఈమేరకు తెలంగాణ బీజేపీ కార్యచరణ రూపొదింస్తుంది.ఈ పర్యటనలో అమిత్‌ షా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

వరంగల్ వేదికగా కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. గతేడాది నుంచి సెప్టెంబర్ 17వ తేదీను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి వరంగల్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కేంద్ర భద్రత దళాలతో వరంగల్‌లో కవాతు నిర్వహణకు ప్లాన్ రూపొందిస్తున్నారు.ఈ కవాతులో అమిత్ షా గౌర వందనం స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెంచిన నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఆసక్తికరంగా మారనుంది...

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 09:13

కాంగ్రెస్‌గూటికి తుమ్మల నాగేశ్వరరావు?

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది.

అతి త్వరలోనే తేదిని ప్రకటించనున్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏఐసీసీ ఆదేశాల మేరకు గురువారం తుమ్మలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవిలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.

తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించారు. గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న తుమ్మలపై కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఫోకస్ పెట్టింది.

పార్టీలోకి తీసుకువచ్చేందుకు స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సీనియర్ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కలిగిన ఉన్న వ్యక్తితో పార్టీకి మేలు జరుగుతుందని భావించారు.దీంతోనే తుమ్మలను కాంగ్రెస్‌లోకి చేరాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక తుమ్మల కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న విషయం తెలుసుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా అనుచరులు, కార్యకర్తలు ఫుల్‌జోష్‌‌లో ఉన్నారు. ప్రాధాన్యత లేని పార్టీలో ఉండటం కంటే.. కాంగ్రెస్‌లో చేరి బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాలని ఆ జిల్లా కార్యకర్తలు నొక్కి చెబుతున్నారు.

ఇక తుమ్మల, రేవంత్‌లు గతంలో టీడీపీలో కలసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో సీనియర్ నేతగా ఉన్న తుమ్మలకు రేవంత్ మంచి ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉన్నదని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కేడర్ చర్చించుకుంటున్నది.

సీనియర్ నేతగా గుర్తింపు...

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరావు రాజకీయాల్లో సుపరిచితుడు. తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1982లో ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలోకి చేరిన ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు.

మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సొంత గడ్డ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి తుమ్మల మొదటి సారి ఓటమి పాలైనా.. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించిన ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టారు.

నిజంనిప్పులాంటిది

Aug 31 2023, 22:10

Chandrayaan-3: చంద్రుడి ఉపరితలంపై సహజ ప్రకంపనలు..?

బెంగళూరు: జాబిల్లిపై శాస్త్రీయ పరిశోధనలు సాగిస్తోన్న చంద్రయాన్‌-3 (Chandrayaan-3) పేలోడ్‌లు.. ఆసక్తికర సమాచారాన్ని వెల్లడిస్తున్నాయి. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు, సల్ఫర్‌ వంటి మూలకాల లభ్యత తదితర సమాచారాన్ని ఇప్పటికే చేరవేశాయి..

ఈ క్రమంలోనే విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander)లోని ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ లూనార్‌ సిస్మిక్‌ యాక్టివిటీ (ILSA) పేలోడ్‌.. తాజాగా చంద్రుడిపై సహజ ప్రకంపనలను నమోదు చేయడం గమనార్హం. ఈ మేరకు ఇస్రో (ISRO) ఓ ట్వీట్‌ చేసింది..

'చంద్రయాన్‌-3 ల్యాండర్‌లోని 'ఇల్సా' పేలోడ్‌.. చంద్రుడి ఉపరితలంపై రోవర్‌, ఇతర పేలోడ్‌ల కారణంగా ఏర్పడిన ప్రకంపనలు నమోదు చేసింది. వీటికి అదనంగా.. అక్కడ సహజంగా ఏర్పడినట్లు భావిస్తోన్న ప్రకంపనలనూ గుర్తించింది. ఆగస్టు 26న వాటిని నమోదు చేసింది. వాటి మూలాన్ని గుర్తించే దిశగా అన్వేషణ సాగుతోంది. ఇదిలా ఉండగా.. 'ఇల్సా' పేలోడ్‌.. చంద్రుడిపై మొట్టమొదటి మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ (MEMS) సాంకేతిక ఆధారిత పరికరం' అని ఇస్రో తెలిపింది. 'ఇల్సా' పేలోడ్‌ను 'లేబొరేటరీ ఫర్‌ ఎలక్ట్రో- ఆప్టిక్స్‌ సిస్టమ్స్‌' రూపొందించిందని వెల్లడించింది. దాన్ని చంద్రుడి ఉపరితలంపై మోహరించే యంత్రాంగాన్ని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసిందని తెలిపింది..

నిజంనిప్పులాంటిది

Aug 31 2023, 21:54

ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సెప్టెంబర్‌ 2,3,4 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

SB NEWS

నిజంనిప్పులాంటిది

Aug 31 2023, 21:29

ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ

శాలిగౌరారం:

అన్నా చెల్లెళ్లు,అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే ఆప్యాయత, మమతానురాగాలు వెలకట్టలేనివని,వారి అన్యోన్యమైన అనుబంధానికి శుభసూచికగా నిలిచే రాఖీ పౌర్ణమి ఒక కుటుంబంలోనే కాక యావత్‌ సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తుందని సామాజిక ఉద్యమకారులు వేముల గోపీనాథ్ అన్నారు.

ఈ సందర్భంగా

రాఖీ పండుగను పురస్కరించుకుని సోదరిమణులు రాఖీ కట్టారు.గోపీనాథ్ సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు.

రక్షా బంధన్‌ ఒక వేడుక మాత్రమే కాదని, కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని చాటుతుందన్నారు.

నిజంనిప్పులాంటిది

Aug 31 2023, 19:13

డీఎస్సీకి అభ్య‌ర్థులు ఏకాగ్రతతో ప్రిపేర్ కావాలి: మంత్రి సబిత ఇంద్రారెడ్డి!

త్వ‌ర‌లో విడుద‌ల కాబోయే డీఎస్సీ నోటిఫికేష‌న్‌కు అభ్య‌ర్థులు ప్రిపేర్ కావాల‌ని, రాజ‌కీయ నేతల విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి గురువారం అధికారుల సమావేశంలో స్ప‌ష్టం చేశారు.

ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే కొంత మంది వ్యక్తులు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఉపాధ్యాయ ఖాళీల భర్తీని డీఎస్సీకి అప్పగించామని మంత్రి పేర్కొన్నారు.

ఉపాధ్యాయ ఖాళీల విషయంలో తప్పుడు ఆరోపణలతో రాజకీయ లబ్ది పొందేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని మంత్రి స‌బిత‌ విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యా రంగానికి పెద్దపీట వేస్తుండటాన్నికాంగ్రెస్ నాయకులు సహించలేకపోతున్నారని పేర్కొన్నారు.

గడచిన తొమ్మిది సంవత్సరాల్లో విద్యా రంగం అభివృద్ధి కోసం రూ. 1,87,269 కోట్లు ఖర్చు చేశామంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్ధమవుతుందని తెలిపారు.తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 2017లో మొదటిసారి 8,972 పోస్టులను భర్తీ చేయడం కోసం డీఎస్సీ నిర్వహించడం జరిగిందని వివరించారు.

ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీల్లో గెజిటెడ్ హెడ్ మాస్టర్, ప్రైమ‌రీ స్కూల్ హెడ్‌మాస్టర్ పోస్టులను, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ పోస్టులను, 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌ను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద‌న్నారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ, నూతన నియామకాలు పూర్తయిన తర్వాత ఖాళీలు ఏమైనా ఉంటే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన తర్వాత గురుకులాల్లో 11 ,715 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, 12 ,150 బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, ఈ సమయంలో అన్ని పార్టీలు, అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల ఖాళీల భర్తీని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, ఈ ప్రక్రియను అడ్డుకొనే వారి మాటలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై అనుచిత విమర్శలు చేస్తున్న నాయకుల మాటలను విశ్వసించకుండా నిరుద్యోగులు డీఎస్సీకి సిద్దమై విజయం సాధించాలని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.......

నిజంనిప్పులాంటిది

Aug 31 2023, 19:11

హైదరాబాద్ పోలీసుల అదుపులో పాక్ యువకుడు

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు అక్రమంగా హైదరాబాద్‌కు రావడం కలకలం రేపుతోంది. నేపాల్ మీదుగా అతడు భారత్‌లోకి ప్రవేశించి హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని మొహమ్మద్ ఫయాజ్‌గా గుర్తించారు.

దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న ఫయాజ్ కొన్ని నెలల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆమె.. గర్భం దాల్చినట్లు అతడికి తెలిపింది. భార్యను కలుసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులతో ఫయాజ్ చెప్పాడు.

వీసా లేకుండా భారత్‌లోకి ఫయాజ్ అక్రమంగా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకొని ఫయాజ్ భార్య ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఫయాజ్ చెప్పిన విషయాలు నిజమా, కాదా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది...

నిజంనిప్పులాంటిది

Aug 31 2023, 18:12

బండి సంజయ్ అమెరికా పర్యటన

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పది రోజుల పాటు ఆయన యూఎస్‌లోనే ఉండనున్నారు.

సెప్టెంబర్ 1 శుక్రవారం తెల్లవారుజామున బండి సంజయ్ యూఎస్‌కు పయనం కానున్నారు. శనివారం సెప్టెంబర్ 2 అట్లాంటాలో జరిగే ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ 15వ వార్షికోత్సవంలో బీజేపీ ఎంపీ ప్రసంగించనున్నారు.

వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ పర్యటన ఖరారైంది.

అక్కడి తెలుగు ఎన్నారై సంఘాలతో ఆయన భేటీ అవుతారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, కళా, సాహిత్య, నాటక, సేవా, వైద్య, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సమావేశాల్లో పొల్గొననున్నారు.